కలం, వెబ్ డెస్క్ : నల్గొండ (Nalgonda) జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మిర్యాలగూడ (Miryalaguda) మండలం ఊట్లపల్లి శివారులోని ఒక వ్యవసాయ పొలంలో తెరిచి ఉన్న బోరు గుంత ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదవశాత్తు నాలుగేళ్ల బాలుడు ఆ బోరు గుంతలో పడిపోయాడు. ప్రమాదాన్ని గమనించిన బాలుడి తాత, స్థానిక ఉప సర్పంచ్ వెంకన్న (53) తన మనవడిని ప్రాణాలతో కాపాడుకోవాలనే ఆరాటంతో వెంటనే స్పందించారు. బాలుడిని పైకి తీసే క్రమంలో ఆయన కూడా అదే బోరు గుంతలో ఇరుక్కుపోయారు.
ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న మిర్యాలగూడ రూరల్ పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. బోరు గుంతలోంచి తాత, మనవడిని పోలీసులు బయటకు తీశారు. అయితే లోపల ఊపిరి ఆడకపోవడం వల్ల వెంకన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచారు. మనవడి ప్రాణం నిలిచినా, అతడిని కాపాడే ప్రయత్నంలో తాత కన్నుమూయడం స్థానికంగా తీవ్ర శోకాన్ని నింపింది.

