కలం మెదక్ బ్యూరో: రూ.651 కోట్లతో 44 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, కేజేఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణానికి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర రాజ నరసింహ శంకుస్థాపన చేశారు. సంగారెడ్డి (Sangareddy) జిల్లా కొండాపూర్ మండలం తోగర్పల్లి గ్రామంలో ఇది ఏర్పాటు కానుంది. ఈ కొత్త యూనిట్ ఏర్పాటు ద్వారా 1,551 మందికి ప్రత్యక్షంగా, 5,000 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. ఫుడ్ ప్రాసెసింగ్, FMCG రంగాల్లో ‘మేడ్ ఇన్ తెలంగాణ’ బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేసేందుకు ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడనుంది.
ఉమ్మడి రాష్ట్రంలో మొదట పరిశ్రమలు ఇక్కడే: మంత్రి దామోదర
మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో మొదట పరిశ్రమలు మెదక్ జిల్లా పటాన్ చెరు ప్రాంతంలో ఏర్పడ్డాయన్నారు. సంగారెడ్డి జిల్లాలో కేంద్ర రంగ సంస్థలైన BHEL, BDL, ODF లాంటి సంస్థలను కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిందన్నారు. వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు వస్తే ప్రాంత ప్రజలకు ఉపాధి లభిస్తుందని తెలిపారు.
తెలంగాణ యువతకు ఉపాధే లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు
మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) మాట్లాడుతూ.. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పూర్తిగా కాలుష్య రహితమన్నారు. 1500 మంది మహిళలకు ఈ పరిశ్రమతో ఉపాధి లభిస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్శిస్తున్నామన్నారు. 2047 నాటికి దేశ జాతీయ ఉత్పత్తిలో 10 శాతం ఉత్పత్తి పెంచేలా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, ఎంపీలు రఘనందన్ రావు, సురేశ్ షెట్కార్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.

