కలం, ఖమ్మం బ్యూరో: ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనే ధ్యేయంగా ఎక్సైజ్ శాఖ దాడులు ఉధృతం చేసింది. ఏదులాపురం (Edulapuram) మున్సిపాలిటీ పరిధిలోని కపిల్ భవన్ ఎదురుగా ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో అక్రమంగా మత్తు పదార్థాలు వినియోగిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవరంలో మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా ఓపియం (నల్లమందు), ఎండు గంజాయి లభ్యం కావడంతో పాటు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. డిప్యూటీ కమిషనర్ జి.జనార్దన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ జి.గణేష్ ఆదేశాల మేరకు ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ సీఐ సీహెచ్.శ్రీనివాస్ తన బృందంతో కలిసి తనిఖీలు చేపట్టారు.
కపిల్ భవన్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న రాజస్థాన్కు చెందిన రన్వీర్ సింగ్ వద్ద 7.6 గ్రాముల ఓపియం, 4.3 గ్రాముల ఎండు గంజాయిని అధికారులు గుర్తించారు. నిందితుడికి అక్కడికక్కడే యూరిన్ టెస్ట్ నిర్వహించగా ఓపియం పాజిటివ్ అని తేలింది. అదే సమయంలో మత్తులో తూలుతున్న గుర్రాలపాడు గ్రామానికి చెందిన ఎస్.కె.కరీం పాషాను పరీక్షించగా, అతనికి గంజాయి పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. పట్టుబడిన ఇద్దరు నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం ముద్దాయిలతో పాటు, స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలను, టెస్ట్ కిట్లను ఖమ్మం-2 ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. ఈ దాడుల్లో హెడ్ కానిస్టేబుల్ జమాల్ షరీఫ్, కానిస్టేబుల్స్ వీరబాబు, ప్రసన్న కుమార్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.
Read Also: కోణార్క్ ఎక్స్ప్రెస్లో చెలరేగిన మంటలు.. తప్పిన ప్రమాదం
Follow Us On: Instagram

