కలం, వెబ్ డెస్క్ : ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియం (Gachibowli Stadium) వేదికగా యోగా ఉత్సవం ఉత్సాహంగా నిర్వహించారు. ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ‘నివారణే మేలు’ అనే నినాదంతో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక యోగా సెషన్లో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Raja Narasimha), రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు స్వయంగా యోగాసనాలు వేశారు.
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి యోగా ఒక దివ్యౌషధంలా పనిచేస్తుందని ఈ సందర్భంగా మంత్రులు పేర్కొన్నారు. వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే, అవి రాకుండా ముందుగానే జాగ్రత్త పడటం ఉత్తమమని ఆరోగ్య వారోత్సవాల ఉద్దేశాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు, అధికారులు, యోగా ప్రేమికులు పాల్గొని వివిధ రకాల ఆసనాలను అభ్యసించారు.

