కలం, వెబ్ డెస్క్: ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సోషల్ మీడియా వేదికగా మాజీ మంత్రి ఆర్కే రోజా (RK Roja), ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila)పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏప్రిల్ 9న వైఎస్ఆర్ పాదయాత్ర 23 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వైఎస్ జగన్ (YS Jagan) ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. దీనిపై స్పందిస్తూ షర్మిల జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. దానికి కౌంటర్గా రోజా రంగంలోకి దిగారు. ఎక్స్లో షర్మిల పోస్టుకు బదులిస్తూ కూటమి పార్టీలకు దత్త పుత్రికగా మారిన మీకు మా నాయకుడు వైఎస్ జగన్ గురించి మాట్లాడే హక్కు ఉందా అని ప్రశ్నించారు. కోట్లాది మంది దేవుడిగా పూజించే వైఎస్ఆర్ను జీవితాంతం వ్యతిరేకించిన చంద్రబాబుతో మీరు చేతులు కలపలేదా అని నిలదీశారు. ఎందుకు జగన్ పతనం కోసం తపనపడుతున్నారని ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో కూటమి పార్టీలను కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని, మీరు మాత్రం ఇక్కడ ఎందుకు చేతులు కలిపారో ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్కు నిజమైన వారసుడు జగనన్నే అని ప్రజలు ఎప్పుడో నిర్ణయించారని స్పష్టం చేశారు. రాష్ట్ర రాజకీయాలను, ప్రజల భవిష్యత్తును పేకాటగా చూస్తున్న మీకు రాజకీయ పరిణితి ఏ మాత్రం ఉందో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు.

