కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM)ను మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివేక్ వెంకట్ స్వామి (Minister Vivek Venkat Swamy) స్పష్టం చేశారు. ఇందుకోసం బడ్జెట్లో రూ.90 కోట్లు కేటాయించామన్నారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ది పార్క్ హోటల్లో భారత్–యూరోపియన్ యూనియన్ మొబిలిటీపై రాష్ట్ర స్థాయి వర్క్షాప్ జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విదేశాంగ మంత్రిత్వ శాఖ, యూరోపియన్ యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో ఇండియా–ఈయూ మైగ్రేషన్ అండ్ మొబిలిటీ ప్రాజెక్ట్ ఫేజ్–2లో భాగంగా నిర్వహించబడింది.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. తెలంగాణ యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. టామ్కామ్ ఒక అద్భుతమైన సంస్థగా ఎదిగిందని చెప్పారు. దీని ద్వారా శిక్షణ పొందిన యువత విదేశాల్లో మంచి ఉద్యోగాలు పొందుతున్నారని తెలిపారు. ముఖ్యంగా జర్మన్ భాష నేర్చుకున్న వారికి యూరోపియన్ దేశాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ కీలక పాత్ర పోషిస్తున్నప్పటికి, యువత ఏఐతో పోటీ పడగల స్కిల్స్ ను డెవలప్ చేసుకోవడం చాలా అవసరమని పేర్కొన్నారు.
ఈ వర్క్షాప్ ద్వారా యూరోప్ దేశాల్లో ఉన్నత విద్య, స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి అవకాశాలపై తెలంగాణ యువతకు స్పష్టమైన అవగాహన కలిగిందని చెప్పారు. గ్లోబల్ ఎడ్యుకేషన్, ఇంటర్నేషనల్ స్కిల్ మొబిలిటీకి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. జర్మనీ సహా పలు యూరోపియన్ దేశాల్లో పెరుగుతున్న నైపుణ్యాల డిమాండ్కు అనుగుణంగా యువతను సిద్ధం చేయడం ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

