కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో సోమవారం తెలంగాణ, కర్ణాటక నీటి పారుదల శాఖ మంత్రులు సమావేశం అయ్యారు. ఇందులో భాగంగా కృష్ణా జలాల ( Krishna Water) వినియోగంపై తెలంగాణ, కర్ణాటక మధ్య చర్చలు జరిగాయి. మంత్రి ఉత్తమ్ తో కర్ణాటక మంత్రి బోసు రాజు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జూపల్లి, వాకిటి , మల్లు రవి ఇతర నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ- కర్ణాటక రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగం, తాగునీటి అవసరాలపై చర్చ జరిగింది. రెండు రాష్ట్రాలకు ఉపయోగపడే రీతిలో సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులపై కూలంకషంగా చర్చలు జరగాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలగొద్దని కోరారు. సాగు నీటి హక్కుల పరీరక్షణకు ప్రాధ్యానం ఇవ్వాలని తెలిపారు. అంతర్ రాష్ట్ర సమన్వయంతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంతో పాటు పరస్పర అవగాహనతోనే కృష్ణా జలాల వినియోగం ఉండాలని సూచించారు.

