కలం, వెబ్డెస్క్: మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణే (Nitesh Rane) బక్రీద్ పండుగను ఆన్లైన్ పద్ధతిలో జరుపుకోవాలంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. హిందూ పండుగలైన హోలీ, దీపావళి చేసుకునేటప్పుడు పర్యావరణ పరిరక్షణ పేరిట నీటిని ఆదా చేయాలని, క్రాకర్స్ కాల్చవద్దని అందరూ పదే పదే సలహాలు ఇస్తుంటారని ఆయన గుర్తు చేశారు. అదే విధంగా ముస్లింలు కూడా బక్రీద్ పండుగను పర్యావరణానికి అనుకూలంగా జరుపుకోవాలని, మూగజీవాలను ఇబ్బంది పెట్టకుండా చేసుకోవాలని సూచించారు. సాంప్రదాయ జంతు బలికి ప్రత్యామ్నాయంగా కంప్యూటర్లో మేక చిత్రాన్ని ఉంచి వర్చువల్గా ఆ సంప్రదాయాన్ని పూర్తి చేయవచ్చని ఒక వీడియోలో వ్యాఖ్యానించారు.
ముస్లిం సమాజం అత్యంత పవిత్రంగా భావించే బక్రీద్ పండుగ వేళ మంత్రి నితీష్ రాణే చేసిన ఈ విచిత్రమైన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఆర్థికంగా స్థోమత ఉన్నవారు జంతు బలి ఇవ్వడం బక్రీద్ పండుగలో ఒక ముఖ్యమైన మతపరమైన ఆచారం. ఈ నేపథ్యంలో పండుగకు కొన్ని రోజుల ముందే మంత్రి ఈ విధమైన ప్రతిపాదన చేయడంపై విభిన్న వర్గాల నుండి తీవ్రస్థాయిలో స్పందనలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా జంతు బలులపై పలువురు బీజేపీ నేతలు తమ స్వరం వినిపిస్తున్నారు. ఆవుల అక్రమ రవాణాపై పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

