కలం, వెబ్ డెస్క్: కర్ణాటక రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామం నెలకొంది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ (DK.Shivakumar) మధ్య ముఖ్యమంత్రి పీఠంపై పీఠముడి నెలకొన్న వేళ.. ఇద్దరు నేతలు దిల్లీకి రావాలని హైకమాండ్ ఆదేశించింది. దీంతో, ఏం జరగబోతుందనేది ఉత్కంఠగా మారింది. ఒప్పందం ప్రకారం, చెరో రెండున్నరేళ్లు సిద్ధరామయ్య, డీకే.శివకుమార్ సీఎంగా ఉండాలని అధిష్ఠానం సూచించింది. మారిన రాజకీయ పరిస్థితుల్లో డీకే.శివకుమార్కు సీఎం కుర్చీ ఇచ్చేందుకు సిద్ధరామయ్య అంగీకరించడం లేదు. దీంతో.. కొంతకాలంగా ఈ అంశంపైనే చర్చలు జరుగుతున్నాయి.
హోం శాఖ కేటాయించే అవకాశం..
ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే.శివకుమార్కు హోం మంత్రి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు అధిష్ఠానం, ఆయన్ను ఇప్పటికే ఒప్పించినట్లు తెలుస్తోంది. ఈ శాఖ పరమేశ్వరన్ వద్ద ఉండగా.. డీకేకు ఇవ్వాలని హైకమాండ్ భావిస్తోంది. అదే జరిగితే, త్వరలోనే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ ఖాయంగా కనిపిస్తోంది. డీకే వర్గానికి చెందిన ఎమ్మెల్యేల్లో కొందరికీ పదవులు దక్కే అవకాశం ఉంది.

