కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రజల స్థానిక, ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) ఒక సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంథని, కరీంనగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలతో పాటు రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి చెందిన పౌరులైనా తమ ప్రాంతాల్లోని ప్రజా సమస్యలను తన దృష్టికి తీసుకురావచ్చని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు. ఈ సమస్యలను పరిశీలించడానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని, ప్రతి సమస్యను పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
సమస్యలను మరింత లోతుగా తెలుసుకునేందుకు ప్రతి వారం ఆన్లైన్లో ప్రజలతో నేరుగా మాట్లాడనున్నట్లు మంత్రి వెల్లడించారు. ముఖ్యంగా యువత తమ స్థానిక సమస్యలను లేవనెత్తుతూ, సరికొత్త ఆలోచనలతో తెలంగాణ ప్రగతిలో భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు. సమస్యల పరిష్కారానికి, తెలంగాణను మరింత బలోపేతం చేయడానికి ప్రజలు తమ వినతులను @DSB4YOUTH అనే ఎక్స్ హ్యాండిల్ ద్వారా పంచుకోవాలని శ్రీధర్ బాబు కోరారు.

