కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారిని రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) (Minister Seethakka) దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయాధికారులు, అర్చకులు మంగళ వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న మంత్రి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దర్శనానంతరం ప్రాకార మండపంలో పండితులు మంత్రి సీతక్కకు వేద ఆశీర్వచనం చేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆమెకు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… భద్రాచలం ఆలయ సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఇప్పటికే ఆలయ అభివృద్ధి కోసం రూ.586 కోట్లు కేటాయించామని, అందులో రూ. 351 కోట్లు మంజూరు కూడా చేయడం జరిగిందని తెలిపారు. వీటికి సంబంధించిన పనులు ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ముమ్మరంగా జరుగుతున్నాయని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఆలయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

