కలం, కరీంనగర్ బ్యూరో: పెద్దపల్లి (Peddapalli) వ్యవసాయ మార్కెట్ యార్డ్లో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. మొక్కజొన్న, ధాన్యం రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు మార్కెట్కు వచ్చి నెలకు పైగా అవుతున్నా, ఇప్పటివరకు 50 శాతం మాత్రమే తూకాలు వేశారన్నారు. అకాల వర్షానికి పంట తడిసి మొలకెత్తే పరిస్థితి వచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సాగు సమయంలో యూరియా, పెట్టుబడి సహాయం అందించడంలో విఫలమైన ఈ ప్రభుత్వం, తీరా పంట చేతికొచ్చాక బార్దాన్, సుతిలి కూడా రైతే కొనుక్కునేలా చేసి, బస్తాలు కూడా రైతులే నింపుకునే దుస్థితి తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తరుగు పేరిట దోపిడీ..
నిబంధనల ప్రకారంఓ బస్తాకు 40 కిలోల 600 గ్రాములు తూకం వేయాల్సి ఉండగా, తరుగు పేరిట క్వింటాకు 5 నుంచి 6 కిలోల వరకు మిల్లర్లు రైతులను దోచుకుంటున్నారని దాసరి మనోహర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షానికి తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని కాలయాపన లేకుండా ప్రభుత్వమే పూర్తి స్థాయిలో వెంటనే కొనుగోలు చేయాలని, దోపిడీకి పాల్పడుతున్న మిల్లర్లపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాబోయే రెండు మూడు రోజుల్లో మళ్లీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున, యుద్ధప్రాతిపదికన కొనుగోళ్లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు.

