కలం, వెబ్ డెస్క్: సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరుగుతున్న మహిళా శక్తి సభ (Mahila Shakti Sabha) ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి సహా, రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు భారీ ఎత్తున ఈ సభకు హాజరయ్యారు. మహిళా సాధికారతకు, ఆర్థిక స్వావలంబన, ఉపాధి విస్తరణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగాన్ని అందిస్తున్నారు. అయితే ఈ సభలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) స్పెషల్ అట్రాక్షన్గా మారారు. మహిళా శక్తి సభ సందర్భంగా సీతక్క తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు పంపిణీ చేస్తున్న ఆకుపచ్చ రంగులో ఉన్న ఇందిరమ్మ మహిళా శక్తి చీరను ధరించారు.
ఈ చీర మహిళా సాధికారత, స్వయం సమృద్ధి, స్వయం సహాయక సంఘాలను సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రధాన శక్తిగా తీర్చిదిద్దే ప్రభుత్వ కట్టుబాటును సూచిస్తుందని పేర్కొన్నారు. చీరతో పాటు సీతక్క ధరించిన ఆభరణాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా మారాయి. చేతికి కడియాలు, ఒడ్డాణం, మెడలో ప్రత్యేక ఆభరణంతో సీతక్క కొత్తగా దర్శనమిచ్చారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం, స్వయం సహాయక సంఘాలను మరింత ప్రోత్సహించడం, స్వయం ఆధారిత సమాజాల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని సీతక్క ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

