కలం, వరంగల్ బ్యూరో : ములుగు (Mulugu) జిల్లా కేంద్రం చుట్టూ త్వరలో అధిక నిధులతో రింగ్ రోడ్డు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని మంత్రి సీతక్క (Minister Seethakka) తెలిపారు. శనివారం ములుగు జిల్లా కేంద్రంలో రూ.50 కోట్ల వ్యయంతో డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పెరుగుతున్న జనాభా, వ్యాపార కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాకు ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
రైతుల పేరుతో బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. వాస్తవ సమస్యలపై మాత్రమే మాట్లాడాలని ఆమె సూచించారు. ప్రజల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ములుగు జిల్లా మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరింత ప్రాధాన్యం ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు.

