కలం, వెబ్ డెస్క్ : మెసాలు, అబద్దాలకు పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) అన్నారు. శనివారం తెలంగాణ భవన్లో జరిగిన ఖైరతాబాద్ నియోజకవర్గ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల హామీలను అమలు చేయాలని అడిగితే సీఎం రేవంత్ రెడ్డి పండబెట్టి తొక్కుతా అని అంటున్నాడని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనతో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారన్నారు. కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారని తలసాని చెప్పారు.
కేసీఆర్ హయాంలో అప్పులు చేసి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాలలో చేసిన రూ.4 లక్షల కోట్ల అప్పులతో ఏం చేశారని తలసాని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ పార్టీ కోసం పని చేస్తున్న కార్యకర్తలకు అండగా నిలబడుతుందని ఆయన భరోసా ఇచ్చారు. రెండున్నర సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినా.. ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చినా ఎగిరేది గులాబీ జెండానే అని తలసాని ధీమా వ్యక్తం చేశారు.

