కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం (Bhadrachalam) టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం పోలీసులు భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాలతో భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో 90 మందికి పైగా పోలీసు అధికారులు, సిబ్బంది అయ్యప్ప కాలనీ, రెవెన్యూ కాలనీల్లో తనిఖీలు చేశారు. ఇళ్లు, వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన పత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని 37 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.
మాదవ ద్రవ్యాలపై నిరంతరం నిఘా..
భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. సమాజానికి ముప్పుగా మారిన మాదక ద్రవ్యాలపై నిరంతరం నిఘా పెట్టినట్లు వివరించారు. గంజాయి అక్రమ రవాణా చేసినవారిపై ఉక్కుపాదం మోపుతామని, వాటి వలన కలిగే నష్టాలను ప్రజలకు వివరించారు. నేరాల నియంత్రణకు సిసి కెమెరాల పాత్ర కీలకమని, అందుకే కాలనీలతో పాటు వీలైతే ప్రతి ఇంటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విపత్కర సమయాల్లో, ఆపదలో ఉన్నప్పుడు ప్రజలు తక్షణమే డయల్ 100కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ సెర్చ్ ఆపరేషన్లో సీఐ నాగరాజు, ఎస్సైలు, సీఆర్పీఎఫ్ సిబ్బంది, ట్రాఫిక్, స్టేషన్ల సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు. మత్తు పదార్థాల గుర్తింపు కోసం ఈ తనిఖీల్లో నార్కోటిక్స్ స్నైఫర్ డాగ్ కూడా ఉపయోగించడం విశేషం.

