కలం, నిజామాబాద్ బ్యూరో : రాష్ట్రంలో తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని మంత్రి సీతక్క (Minister Seethakka) తెలిపారు. నిజామాబాద్ నగరంలోని మార్కెట్ యార్డులో రూ. 6.56 కోట్ల నిధులతో చేపడుతున్న షెడ్ల నిర్మాణాలు, మడిగెలు, సోలార్ విద్యుత్ తదితర పనులకు మంత్రి శనివారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, నగర మేయర్ ఉమారాణి లతో కలిసి శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీతక్క మాట్లాడుతూ, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందనే కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ సంక్షేమానికి కట్టుబడి పని చేస్తోందన్నారు. రాష్ట్రంలో రైతాంగ ప్రభుత్వం కొనసాగుతోందని తెలిపారు. అప్పుల భారం వల్ల తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు నెలకొని ఉన్నప్పటికీ రైతులకు పంట రుణాల మాఫీ, రైతు భరోసా, సన్న ధాన్యానికి బోనస్ అందిస్తున్నట్లు ఆమె (Minister Seethakka) గుర్తు చేశారు. రాష్ట్ర చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా యాసంగి సీజన్ లో పెద్ద ఎత్తున పంటలు సాగు చేశారని అన్నారు.
ప్రతి పంటకు పూర్తిస్థాయిలో మద్దతు ధర చెల్లిస్తూ, చివరి గింజ వరకు కూడా ప్రభుత్వమే పంటలను కొనుగోలు చేసి రైతులను ఆదుకుందని మంత్రి సీతక్క తెలిపారు. ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి అధ్యక్షత వహించగా, అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నగేష్ రెడ్డి, ఏఎంసీ పాలకవర్గ ప్రతినిధులు, రైతులు, హమాలీలు, గుమాస్తాలు, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

