కలం, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి జన్మదిన నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయ అధికారులు ఆధ్వర్యంలో వైకుంఠ ద్వారం వద్ద యాదాద్రి గిరిప్రదక్షిణ (Yadadri Giri Pradakshina) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలేరు ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య (MLA Beerla Ilaiah) పాల్గొన్నారు.
వేకువజామున ఆలయ ముఖ మండపంలో అర్చకులు శతఘటాభిషేకాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం స్వామివారి పాదాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఆలయ ఈవో భవాని శంకర్తో కలిసి గిరిప్రదక్షిణను ప్రారంభించారు. స్వాతి జన్మ నక్షత్రం సందర్భంగా నిర్వహించిన ఈ గిరిప్రదక్షిణలో వేలాది మంది భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. గోవింద నామస్మరణలు, భక్తుల ఆధ్యాత్మిక సందడితో యాదగిరిగుట్ట పరిసరాలు మార్మోగాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు.

