కలం, వెబ్ డెస్క్: ఎర్రమంజిల్లోని (Errum Manzil ) మిషన్ భగీరథ కార్యాలయంలో మంత్రి సీతక్క (Minister Seethakka) అధ్యక్షతన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) 9వ రాష్ట్ర ఉపాధి హామీ మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎన్. శ్రీధర్, డైరెక్టర్ దివ్య దేవరాజన్తో పాటు మండలి సభ్యులు గుమ్మడి సొమయ్య, బీరెడ్డి భగవాన్ రెడ్డి, ఎన్. ప్రతాప్ రెడ్డి, సిద్ధరబోయిన శ్రీనివాస్ ముదిరాజ్, గండీడ్ నరసింహులు గౌడ్, ధండు రమేష్, చల్లా నారాయణ రెడ్డి, మండరాపురం నాగేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో రాష్ట్రంలో ఉపాధి హామీ చట్టం అమలు విధానం, కల్పించిన పని దినాలు, చేపట్టిన పనులు, సృష్టించిన సామాజిక ఆస్తులు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై సమీక్షించారు. గ్రామీణ పేదల జీవనోపాధికి ఎంజీఎన్ఆర్ఈజీఏ కీలక భూమిక పోషిస్తోందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. మండలి సభ్యులు పథకం అమలులో మెరుగుదలకు సంబంధించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి విధిగా రాష్ట్ర ఉపాధి హామీ మండలి సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.
కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రతిపాదిస్తున్న “విబిజీ రాంజీ” విధానం అమల్లోకి వస్తే కూలీలు నష్టపోయే ప్రమాదం ఉందని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. కూలీలకు ఉపాధి హక్కుగా లభించే ఎంజీఎన్ఆర్ఈజీఎ (MGNREGA) చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని మండలి ఏకగ్రీవంగా తీర్మానించింది. గ్రామీణాభివృద్ధి, పేదల సంక్షేమం, సామాజిక ఆస్తుల సృష్టి, మౌలిక వసతుల అభివృద్ధిలో ఉపాధి హామీ పథకం మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డాక్టర్ సీతక్క (Minister Seethakka) స్పష్టం చేశారు.
Read Also: సినిమా ఫ్లాఫ్.. హీరోయిన్ మాత్రం సూపర్ హిట్
Follow Us On: Instagram

