గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యం: మంత్రి పొన్నం

కలం, మెదక్ బ్యూరో: హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు సాగునీరు అందించే గౌరవెల్లి ప్రాజెక్టు (Gouravelli Project) నిర్మాణాన్ని పూర్తి చేయడం తన బాధ్యత అని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) తెలిపారు. భూ నిర్వాసితులకు త్వరలోనే పరిహారం చెల్లించి కాల్వల నిర్మాణ పనులను కూడా పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయి ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో పాల్గొని నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మంత్రి వివరించారు.

గత రెండు సంవత్సరాల ఐదు నెలల ప్రజా పాలన ప్రభుత్వంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సహకారంతో హుస్నాబాద్‌లో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశామని తెలిపారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. హుస్నాబాద్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ఎల్లమ్మ చెరువు, అర్బన్ పార్క్, పట్టణ సుందరీకరణ వంటి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. అలాగే ఏటీసీ సెంటర్, న్యాక్ శిక్షణ కేంద్రం ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని తెలిపారు.

250 పడకల ఆసుపత్రి అభివృద్ధి జరుగుతోందని, మెడికల్ కాలేజీ మంజూరై త్వరలో తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. పార్టీలకు అతీతంగా విద్య, వైద్యం, వ్యవసాయం, మౌలిక వసతుల అభివృద్ధికి కలిసి పని చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులను ఆయన కోరారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ శాఖల ద్వారా రోడ్లను అభివృద్ధి చేశామని, కొత్తపల్లి–హుస్నాబాద్ నాలుగు వరుసల రహదారి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. హుస్నాబాద్–అక్కన్నపేట నాలుగు వరుసల రహదారి టెండర్లు పిలిచినట్లు వివరించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమిష్టిగా పనిచేసి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>