కలం, వెబ్ డెస్క్: శ్రీశైలం వెళ్లే భక్తులు మల్లికార్జునస్వామి దర్శనం తరువాత ఇష్ట కామేశ్వరీ అమ్మవారి (Ishtakameshwari Temple) ఆలయానికి వెళ్లి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ గుడిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అటవీ అధికారులు ప్రకటించడంతో భక్తులు నిరుత్సాహపడుతున్నారు. నల్లమల అభయారణ్యంలో ఉండే ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శంచుకోవాలంటే సాహసం చేయాల్సిందే. ఈ అభయారణ్యం టైగర్ రిజర్వు అటవీ ప్రాంతం కావటంతో లోపలికి వెళ్లాలంటే, అటవీ శాఖ అధికారుల అనుమతులు తప్పనిసరి. అది కూడా ముందు టికెట్లు బుక్ చేసుకున్నవారికే అనుమతిస్తారు. భక్తులను ఆలయానికి తీసుకెళ్లేందుకు చెంచుల జీపులను వినియోగిస్తుంటారు. శ్రీశైలం సమీపంలోని శిఖరం నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంటుంది.
వివాదం కారణంగానే..
భక్తులను లోపలికి తీసుకెళ్లే చెంచు జీపు డ్రైవర్లు, అటవీ శాఖ అధికారుల మధ్య వివాదం తలెత్తడంతో ఆలయ సందర్శన నిలిపివేశారు. ఇప్పటికే జారీ చేసిన టికెట్లను సైతం సిబ్బంది వెనక్కి ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నాయని.. అవి కొలిక్కి వచ్చేంత వరకు ఆలయ సందర్శనకు ఎవరినీ అనుమతించబోమని అధికారులు తేల్చి చెబుతున్నారు. వివాదం సద్దుమణిగిన తరువాత యాత్ర పునః ప్రారంభిస్తామంటున్నారు.

