కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలపై ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అధికారులతో సమీక్ష చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్, సిటీ పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్లలో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. చెట్లు కూలిపోవడం, విద్యుత్ తీగలు తెగిపడిన ఘటనలపై మంత్రి ఆరా తీశారు. విద్యుత్ షాక్తో పాతబస్తీలో ఇద్దరు వ్యక్తులు మరణించారని తెలుసుకుని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కూలిన చెట్లు, తెగిన విద్యుత్ తీగలు తొలగించాలని సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీస్, విద్యుత్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్, రెవెన్యూ తదితర శాఖలు వర్షాకాలం నేపథ్యంలో మరింత సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
సైబరాబాద్లో భారీ వర్షం..
సైబరాబాద్లో కురిసిన భారీ వర్షంతో విపరీతంగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో వాహనాల రద్దీ నెలకొంది. సికింద్రాబాద్ వైపు ఈదురుగాలులతో వర్షం పడింది. నాంపల్లి, అబిడ్స్, కోఠి ప్రాంతాల్లోనూ దంచి కొట్టడంతో వరద నీరు రోడ్లపై నిలిచిపోయింది.

