కలం, కరీంనగర్ బ్యూరో: ధాన్యం కొనుగోళ్లలో అలసత్వం వద్దు అని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అధికారులను ఆదేశించారు. కరీంనగర్ (Karimnagar) జిల్లా చిగురు మామిడి మండలం నవాబ్ పేట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం పరిశీలించారు. వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. ధాన్యం భారీగా వస్తుండడంతో గన్నీ బ్యాగ్స్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, ప్రతి ఐకేపీ కేంద్రానికి కాంట పూర్తయిన ధాన్యం సంచులు లారీల్లో మిల్లులకు పంపించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆకస్మిక వర్షం వస్తే ధాన్యం తడవకుండా టార్ఫాలిన్ కవర్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ధాన్యం రవాణా తరలింపుకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా ఎంవీఐ అధికారిని నియమించామని తెలిపారు. ఎండల్లో హమాలీ జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.ఐకేపీ కేంద్రాల్లో పంచాయతీ సెక్రటరీ, ఏఈవో, గ్రామ ధాన్యం కొనుగోలు కమిటీ సమన్వయం చేసుకుంటూ కొనుగోలు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.
నూతన గృహ ప్రవేశ వేడుకలో..
నవాబుపేటలో నూతన గృహ ప్రవేశం కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. రెండవ దశ ఇందిరమ్మ ఇళ్లు జూన్ నుండి ప్రారంభం కాబోతున్నాయని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయిన వారు ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసుకోవాలని కోరారు. స్థానిక నాయకులు వారికి సహకరించాలని కోరారు.
ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన..
ఆరేపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందని తెలిపారు. గన్నీ బ్యాగ్స్, ధాన్యం సేకరణ కేంద్రాల నుండి మిల్లులకు రవాణా ఇబ్బందులు లేకుండా లారీలు తదితర అంశాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
కొత్త చెరువు అభివృద్ధి పనుల పరిశీలన
అదేవిధంగా హుస్నాబాద్లో కొత్త చెరువు అభివృద్ధి పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. కట్ట సుందరీకరణ, తూము అభివృద్ధి పనులు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కట్ట వెడల్పు పూర్తయితే దానిపై దశల వారీగా సీసీ రోడ్డు పనులు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త చెరువు కట్ట లింక్ రోడ్డును సిద్దిపేట జాతీయ రహదారి లింక్ నుండి హుస్నాబాద్ కరీంనగర్ ఔటర్ రోడ్డుగా ఉపయోగించవచ్చని సూచించారు.

