కలం, వెబ్ డెస్క్: తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీలో బల నిరూపణ సందర్భంగా హైడ్రామా చోటు చేసుకుంది. అన్నాడీఎంకేలో రెండు వర్గాల ఎమ్మెల్యేల వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ప్రసంగం అనంతరం స్పీకర్.. రెబల్ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్పీ.వేలుమణికి అవకాశం ఇవ్వడంతో పళనిస్వామి వర్గీయులు అభ్యంతరం తెలిపారు. దీంతో ఎమ్మెల్యేల మధ్య మాటల తూటాలు పేలాయి. స్పీకర్ చొరవతో ఇరు పక్షాలు శాంతించాయి. పళనిస్వామి మాట్లాడుతూ.. తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తున్నట్లు ప్రకటించారు. ప్రతిపక్ష పార్టీగా తమ బాధ్యత నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు.
ఉదయనిధి స్టాలిన్ విమర్శలు..
బల నిరూపణ సందర్భంగా మాట్లాడిన డీఎంకే ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్.. ముఖ్యమంత్రి విజయ్ తీరుపై మండిపడ్డారు. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలతో సమావేశాన్ని ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. “మార్పు.. మార్పు.. అన్నారని అభివృద్ధిలో మార్పు చూపిస్తారా.. లేకపోతే పార్టీల్లో మార్పు చూపిస్తారా” అని ఘాటుగా వ్యాఖ్యానించారు. సీఎం తీరుకి నిరసనగా తాము వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు.

