కలం, వెబ్ డెస్క్ : దేశంలో లోక్సభ సీట్ల పునర్విభజన (Delimitation) అంశంపై మాట్లాడే ముందు ఒక్కసారి లెక్కలు సరిచూసుకోవాలి అంటూ.. మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం (Chidambaram) చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) కౌంటర్ ఇచ్చారు. డియర్ సర్.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ప్రకారం 1971 జనగణన ఆధారంగా లోక్సభ సీట్ల కేటాయింపు నిలిపివేయబడింది. 2026 తర్వాత నిర్వహించబోయే జనగణనతో ఈ ఫ్రీజ్ ముగుస్తుంది. దీంతో సీట్ల పునర్విభజన తప్పనిసరి అవుతుంది.
దక్షిణ భారత రాష్ట్రాలు ఉత్తర రాష్ట్రాలతో పోలిస్తే ప్రాతినిధ్యం కోల్పోయే అవకాశం ఉంది. ఇదే సమస్యను తమ పార్టీ ఎప్పటినుంచో ప్రస్తావిస్తోందని లోకేశ్ తెలిపారు. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ బిల్లు ద్వారా అన్ని రాష్ట్రాలకు న్యాయం చేయాలని ఎన్డీయే ప్రయత్నించిందని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును పార్లమెంట్లో వ్యతిరేకించిందని ప్రశ్నించారు. 2026 జనగణన తర్వాత పరిస్థితులపై కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వాలని, దక్షిణ రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గకుండా ఏ చర్యలు తీసుకుంటారో చెప్పాలని లోకేశ్ డిమాండ్ చేశారు.

