కలం, నాగార్జున సాగర్ : ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధ వారసత్వ క్షేత్రం నాగార్జున సాగర్లోని బుద్ధవనం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. బుద్ధ పూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం ఇక్కడ నిర్వహించిన ప్రత్యేక వేడుకల్లో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బుద్ధ వనం చేరుకున్న వీరు ముందుగా బుద్ధచరిత వనంలోని బుద్ధుడి పాదాల వద్ద ప్రార్థనలు చేశారు. అనంతరం వందన సమర్పణతో పుష్పాంజలి ఘటించారు.
మహస్తూపం అంతర్భాగంలోని ధ్యాన మందిరంలో బౌద్ధ సంప్రదాయబద్ధంగా ప్రార్థనలు నిర్వహించి ధ్యానం చేశారు. బుద్ధవనం విశేషాలను తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి (Minister Jupally Krishna Rao) మాట్లాడుతూ.. గౌతమ బుద్ధుని బోధనలు ఎప్పటికీ ఆచరణీయమని కొనియాడారు. ప్రపంచానికి శాంతి, అహింసల మార్గాన్ని చూపిన మహనీయుడు బుద్ధుడు. ద్వేషం ఉన్న చోట ప్రేమను, అశాంతి ఉన్న చోట ప్రశాంతతను నెలకొల్పడమే బౌద్ధ ధర్మం యొక్క ప్రధాన ఉద్దేశ్యం అని చెప్పారు. తెలంగాణ గడ్డపై బౌద్ధ వారసత్వ సంపద పుష్కలంగా ఉందని, నాగార్జున సాగర్లోని బుద్ధవనాన్ని అంతర్జాతీయ స్థాయి బౌద్ధ పర్యాటక కేంద్రంగా మరింత తీర్చిదిద్దుతామన్నారు.
ఇక్కడికి వచ్చే పర్యాటకుల కోసం మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే కాకుండా, బుద్ధుని జీవిత విశేషాలను భావితరాలకు తెలియజేసేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తాం అని మంత్రి స్పష్టం చేశారు. ఈ వేడుకల్లో నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ సీఎస్ వాణిప్రసాద్, టీజీటీడీసీ ఎండీ గౌతమి, డైరెక్టర్ ఆఫ్ టూరిజం లక్ష్మణ్ రంజిత్ నాయక్, బుద్ధవనం స్పెషల్ ఆఫీసర్ మల్లెపల్లి లక్ష్మయ్య, ఇతర అధికారులు, బౌద్ధ భిక్షువులు పాల్గొన్నారు.

