కలం మెదక్ బ్యూరో: విద్య, వైద్య రంగాల్లోనూ ఇక నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బులిటీ (సీఎస్ఆర్) నిధులు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha) ఆదేశించారు. సామాజిక అభివృద్ధిలో పరిశ్రమల నిర్వాహకులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. శనివారం సంగారెడ్డి కలెక్టరేట్లో కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి సంబంధిత శాఖల అధికారులు, వివిధ పరిశ్రమలు, కంపెనీల ప్రతినిధులతో సీఎస్ఆర్ సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లాకు పరిశ్రమల నుంచి వస్తున్న సీఎస్ఆర్ నిధుల గురించి ఆరా తీశారు. జిల్లాలో విద్య, వైద్యం, తాగునీరు, పారిశుద్ధ్యం, మహిళా సాధికారత, నైపుణ్యాభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, వైద్య సంస్థల మౌలిక సదుపాయాల అభివృద్ధికి సీఎస్ఆర్ నిధులను కేటాయించాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు సంగీత, పాండు, ఆర్డీవోలు, సంబంధిత శాఖల అధికారులు, పరిశ్రమలు, కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

