కలం, కరీంనగర్ బ్యూరో: ధర్మపురి నియోజకవర్గంలోని ప్రతి తండా, గూడెంకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri Laxman) అన్నారు. బంజారాల శీత్ల పండుగ వేడుకల్లో భాగంగా మంగళవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బంజరు పల్లి లంబాడి తండా, కమ్మర్ ఖాన్ పేట తండా తండాల్లో జరిగిన సీత్ల పండుగ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ.. ధర్మపురి నియోజకవర్గంలోని ప్రతి తండాలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు.
ధర్మపురి నియోజకవర్గంలోని తండాలను ప్రధాన రోడ్లను కలుపుతూ రూ. 68 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు మంత్రి వివరించారు. నియోజకవర్గంలోని తండాల్లో మౌలిక సదుపాయాలు కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు. లంబాడి తండా గిరిజన భవన నిర్మాణానికి రూ. 25 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. లంబాడి తండాలో సేవాలాల్ మహారాజ్ దుర్గామాత ఆలయాలకు సంబంధించిన పనులు త్వరలోనే పూర్తి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

