కలం, కరీంనగర్ బ్యూరో : జగిత్యాల జిల్లా, గొల్లపల్లి మండలం తిరుమలపూర్ (Thirumalapur) గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri) ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్, బోరు బావిని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ రబీ సీజన్లో జిల్లాలో భారీగా వరి, మొక్కజొన్న దిగుబడులు వచ్చాయని తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు.
జగిత్యాల జిల్లాలో ఇప్పటికే 2.61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు. మిగిలిన ధాన్యం కొనుగోలుకు అధికారులు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు. తిరుమలాపూర్ గ్రామ రైతులు ఐక్యతతో సొసైటీని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ధాన్యము కొనుగోలుకు రైతులు సమిష్టిగా నిధులు సేకరించి స్థలం కొనుగోలు చేసినందుకు మంత్రి అభినందించారు. తిరుమలాపూర్ గ్రామంలో సమస్యల పరిష్కారానికి తన వంతుగా సహకరిస్తానని రాజకీయాలకు అతీతంగా గ్రామస్థులు సహకరించాలని మంత్రి కోరారు.

