కలం, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri) డిమాండ్ చేశారు. ఇంధన ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం ప్రజల సంక్షేమాన్ని పక్కనపెట్టి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే వ్యవహరిస్తోందని ఆరోపించారు.
మంత్రి (Minister Adluri) మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం మతం పేరుతో రాజకీయాలు చేయడంలోనే ఎక్కువ ఆసక్తి చూపుతోందని మండిపడ్డారు. పేదల సమస్యలు, వారి జీవనోపాధి, ధరల పెరుగుదలపై ఏమాత్రం దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థ అస్థిరంగా మారుతున్నా, రూపాయి విలువ రోజురోజుకు పడిపోతున్నా ప్రధాని నరేంద్ర మోదీ పట్టించుకోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ ప్రభుత్వ వైఖరి కారణంగానే ప్రజలు భారాన్ని మోస్తున్నారని ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ (BRS) పార్టీ కేంద్ర ప్రభుత్వంపై స్పష్టమైన వైఖరి తీసుకోవడం లేదని మంత్రి అడ్లూరి విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. పెట్రోల్ ధరల పెంపుపై కేటీఆర్, హరీశ్ రావు, జీవన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు మూడు పంటల వడ్లు కొనుగోలు చేసినప్పటికీ, కేంద్ర పరిధిలోని భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) రాష్ట్రం నుంచి బియ్యం సేకరణ విషయంలో సహకరించడం లేదని విమర్శించారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ విషయంలో తన బాధ్యతను సరిగా నిర్వర్తించడం లేదని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి, కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రజలపై భారాన్ని పెంచుతున్నాయని, రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
Read Also: పోలీసులకు పాటల రచయిత అనంత్ శ్రీరామ్ ఫిర్యాదు
Read Also: ప్యాకేజ్డ్ బేబీ స్కామ్

