కలం, జనగామ: జనగామ (Jangaon) జిల్లా కేంద్రంలో అధికారులు దుకాణాలను తొలగించడంతో కలకలం రేగింది. మంగళవారం అర్ధరాత్రి కలెక్టరేట్ కార్యాలయం పరిసరాల్లో మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్న టీ స్టాళ్లు, మిల్క్ సెంటర్లను అధికారులు తొలగించారు. ఎర్రగొళ్ల పహాడ్కు చెందిన కల్యాణి, చీటకోడూరుకు చెందిన చిన్న మంజుల, పొత్కనూరి విజయలక్ష్మి తదితర మహిళలు స్టాళ్లను నిర్వహిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. వీరు గతంలో ప్రభుత్వ పథకాల కింద రుణాలు పొంది ఈ వ్యాపారాలు చేపట్టారు. అయితే కలెక్టరేట్ పరిసరాల్లో అనధికార నిర్మాణాలను తొలగించే క్రమంలో అధికారులు ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
సమయం ఇవ్వకుండా కూల్చేశారు: బాధితులు
బాధిత మహిళలు మాత్రం తగిన సమయం ఇవ్వకుండా, అర్ధరాత్రి వేళ తొలగించడం వల్ల తమకు నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ స్టాళ్ల విషయమై గతంలో న్యాయపరమైన ప్రక్రియ కొనసాగినట్లు సమాచారం. కోర్టు ఇచ్చిన గడువు విషయంపై కూడా చర్చ సాగుతోంది. ఇటీవల స్థానిక ప్రజాప్రతినిధులు ఈ స్టాళ్లను సందర్శించి మహిళలకు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. తాజా పరిణామాలతో ఈ అంశం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
Read Also: ప్రకాశ్ రాజ్ను చంపేయండి.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

