కలం, వరంగల్ బ్యూరో: పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన స్టే కాంగ్రెస్ కుట్రలకు చెంప పెట్టు అని, బీఆర్ఎస్ పార్టీ నిజాయితీకి నిదర్శనమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజకీయ కక్ష సాధింపు కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రైతులను ఆగం చేసిందని మండిపడ్డారు.ఇప్పటికైనా రాజకీయ కుట్రలు పక్కన పెట్టి రైతన్నల కోసం పనిచేస్తూ సాగునీటిని విడుదల చేయాలని కోరారు.
రెండున్నరేళ్లుగా కల్ప తరువు లాంటి కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టును పడావు పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ముక్కు నేలకు రాసి, రాష్ట్రంలోని అన్నదాతలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అది పీసీ ఘోష్ కమిషన్ కాదని, ముమ్మాటికీ పీసీసీ (PCC) నివేదిక అని బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి చెబుతున్న మాట ఇవ్వాళ అక్షరాలా నిజమని తేలిపోయిందన్నారు.
భారత రాజ్యాంగానికి, చట్టాలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా దేశంలోని గౌరవ న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవని ఈ తీర్పుతో మరోసారి రుజువైందని ఎర్రబెల్లి (Errabelli Dayakar ) అన్నారు. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ కుట్రలకు బ్రేక్ పడినట్లయిందన్నారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మేడిగడ్డ బ్యారేజిలో స్వల్పంగా దెబ్బతిన్న రెండు పిల్లర్లను రిపేర్ చేసి, రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల సాగునీటి కష్టాలు తీర్చాలన్నారు. గోదావరి జలాలను పక్క రాష్ట్రానికి పంచి పెట్టి, తెలంగాణలో వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టే కుతంత్రాలను ఇంకా కొనసాగించాలని చూస్తే రేవంత్ సర్కారును రైతులు ఉరికించి కొట్టే రోజులు తప్పవని ఎర్రబెల్లి హెచ్చరించారు. ప్రాజెక్టుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ, రైతుల పొలాలకు నీరు అందకుండా చేస్తున్న ప్రభుత్వ వైఖరిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.
Read Also: ప్రకాశ్ రాజ్ను చంపేయండి.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
Follow Us On: X(Twitter)

