కలం, నల్లగొండ బ్యూరో : దేశానికి ఉత్తమ ఉపాధ్యాయులను అందించాల్సిన బాధ్యత బీఈడీ (B.Ed), బీపీఈడీ (B.P.Ed) కళాశాలలపై ఉందని, అందుకు అనుగుణంగా ప్రతి కళాశాల నాణ్యత ప్రమాణాలను పాటించాలని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ (MGU VC) ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయ పరిధిలోని బీఈడీ (B.Ed), బీపీఈడీ(B.P.Ed) కళాశాలల ప్రిన్సిపాల్స్తో ‘ఆడిట్ సెల్’ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ.. కళాశాలల నిర్వహణ, విద్యా ప్రమాణాలపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి కళాశాల విధిగా ‘ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టం’ను (Face Recognition Attendance) ఏర్పాటు చేయాలని, దీనివల్ల పారదర్శకత పెరుగుతుందని తెలిపారు.
నిబంధనల ప్రకారం అర్హులైన అధ్యాపకుల నియామకం జరగాలని, ఖాళీలు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. విద్యార్థుల హాజరు శాతం పట్ల కఠినంగా ఉండాలని, క్రమం తప్పకుండా తరగతులు నిర్వహించాలని సూచించారు. కేవలం థియరీ మాత్రమే కాకుండా, విద్యార్థులకు అవసరమైన ప్రాక్టికల్స్ నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైస్ ఛాన్సలర్ (MGU VC) తెలిపారు. నాణ్యమైన విద్య ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని, సమాజాన్ని నిర్మించే ఉత్తమ ఉపాధ్యాయులను తయారు చేసి దేశాభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, ఆడిట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ వై.ప్రశాంతి, డాక్టర్ జయంతి, సమరీన్ ఖజ్మీ, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్లు పాల్గొన్నారు.
Follow Us On: Instagram

