కలం, ఖమ్మం బ్యూరో: గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు, రైతు కూలీలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA Scheme) కింద జాబ్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి వంద రోజుల పని దినాలు కల్పించనున్నట్లు ఖమ్మం (Khammam) జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కె. శ్రీరామ్ ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. అయితే, ఈ పనులు పొందడానికి జాబ్ కార్డుతో పాటు ఈ-కేవైసీ నమోదు చేసుకోవడం తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని కూలీలు, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
జిల్లాలో ఉపాధి పనులు (MGNREGA Scheme) ముమ్మరంగా సాగుతున్నాయని, ప్రస్తుతం సుమారు 63 వేల మంది కూలీలు ప్రతిరోజూ పనులకు హాజరవుతున్నారని డీఆర్డీఓ తెలిపారు. కూలీల రెక్కల కష్టానికి ఫలితంగా, మే 16న పెండింగ్లో ఉన్న రూ. 16.76 కోట్ల వేతన నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని ఆయన వెల్లడించారు. ఈ నిధులు నేరుగా కూలీల బ్యాంకు ఖాతాల్లో జమ కానుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
రైతులకు కేవలం కూలి పనులకే పరిమితం చేయకుండా, వారి సొంత భూముల్లోనే శాశ్వత ఆదాయం కల్పించేందుకు ఉపాధి హామీ పథకం కింద సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అర్హులైన రైతుల భూముల్లో ప్రభుత్వ ఆర్థిక సహాయంతో ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా మామిడి, జామ, డ్రాగన్ ఫ్రూట్, కొబ్బరి, జీడిమామిడి, సీతాఫలం, మునగ, వెదురు తోటల పెంపకం చేపడుతున్నారు. ఇందుకు గాను 5 ఎకరాల లోపు భూమి ఉండి, జాబ్ కార్డు కలిగిన ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులు ఈ పథకానికి అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది.
తోటల పెంపకం చేపట్టాలనుకునే రైతులు, పని కావాలనుకునే కూలీలు వెంటనే తమ మండల కార్యాలయంలోని ప్రోగ్రామ్ అధికారి లేదా అదనపు ప్రోగ్రామ్ అధికారిని సంప్రదించి, తమ పేర్లను నమోదు చేసుకోవాలని డీఆర్డీఓ కె. శ్రీరామ్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
Read Also: తలనొప్పి ప్రదేశాల రహస్యాలు.. ఏ భాగంలో నొప్పి వస్తే ఏ సమస్యో తెలుసా?
Follow Us On: Instagram

