కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వ ఐటీ శాఖ పరిధిలో ఉన్న ‘మీ సేవ’ ద్వారా తెచ్చిన ‘మీ టికెట్’ యాప్ (Mee Ticket App) ఎన్నో రవాణా సర్వీసులను అరచేతిలో ఉన్న ఫోన్ ద్వారా పొందే సౌకర్యాన్ని కల్పిస్తోంది. బస్, మెట్రో ప్రయాణ టికెట్లు మొదలు టెంపుల్స్, పార్కులు, మ్యూజియం, ఫారెస్ట్ సఫారీ సందర్శన ఇలా చాలా రకాల సౌకర్యాలు, వాటి టికెట్లను అక్కడి క్యూ లైన్ తో సంబంధం లేకుండా ఈ యాప్ ద్వారా నేరుగా బుక్ చేసుకోవచ్చు. తాజాగా త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని సేవలను ఈ యాప్ పరిధిలోకి తీసుకువస్తామని ‘మీ సేవ’ కమీషనర్ రవి కిరణ్ వెల్లడించారు. ఒకవేళ ఎవరైనా ఎలక్ట్రిక్ కారులో (EV Car) ప్రయాణిస్తే సమీపంలో ఉన్న ఛార్జింగ్ స్టేషన్ లొకేషన్ కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకునే వెసలుబాటు కల్పించినట్లు తెలిపారు.
టికెట్ ఏదైనా.. యాప్ ఒక్కటే..
ఇండోర్, అవుట్ డోర్ యాక్టివిటీస్ తో పాటు వివిధ సేవలను ఒకే యాప్ ద్వారా అందించటమే లక్ష్యంగా ‘మీ టికెట్’ యాప్ (Mee Ticket App) పనిచేస్తోంది. ‘టికెట్ ఏదైనా.. యాప్ ఒక్కటే’ నినాదంతో ప్రవేశపెట్టిన ఈ యాప్ కొద్ది రోజుల్లోనే మంచి ప్రజాదరణ పొందింది. ఇప్పటికే సుమారు 2.5 లక్షల మంది ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. 6 లక్షలకు పైగా సేవలను వినియోగదారులు బుక్ చేసుకున్నారు. రూ.4 కోట్లకు పైగా విలువైన లావాదేవీలు సురక్షితంగా జరిగాయి. వివిధ ప్రభుత్వ శాఖలు నిర్వహించే 219 లొకేషన్లలో ‘మీ టికెట్’ యాప్ ద్వారా అక్కడి సేవలకు సంబంధించిన ప్రవేశ టికెట్లను నేరుగా యాప్ లోనే ప్రజలు పొందుతున్నారని రవికిరణ్ తెలిపారు. సందర్శించే ప్రాంతం ఏదైనా, అక్కడిదాకా వెళ్లి క్యూలైన్ లో నిరీక్షించే బదులు ‘మీ టికెట్’ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని సులభంగా, సౌకర్యవంతంగా అక్కడి ఎంట్రీ టికెట్లను, సౌకర్యాలను బుక్ చేసుకోవచ్చని చెప్పారు. ఐటీ సేవలను పౌరసమాజం నిత్య జీవితంలో మరింతగా వాడుకునేలా విస్తరిస్తామని ఇప్పటికే మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) చెప్పిన విషయం తెలిసిందే.
Read Also: కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావుకు హైకోర్టులో ఊరట
Follow Us On : WhatsApp

