కలం, మెదక్ బ్యూరో: ఈ నెల 9న మెదక్ (Medak) జిల్లా ఏడుపాయల ఆలయ శివారు చెలిమేకుంట సమీపంలో సులోచన అనే మహిళ దారుణంగా హత్యకు గురైంది. పోలీసులు లోతుగా విచారణ చేసి కేసును ఛేదించారు. సులోచన హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తేల్చారు. ఈ మేరకు మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ బుధవారం వివరాలను తెలియజేశారు. పాపన్నపేట (మం) కొడుపాక గ్రామానికి చెందిన సులోచన(35) భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటుంది. మెదక్లో భవన నిర్మాణ పనులకు వెళ్లేది. ఈ క్రమంలో మేస్త్రీ రాజు(47)తో పరిచయం ఏర్పడింది. మేస్త్రీ సులోచనతోపాటు బూలీ అనే మహిళతోనూ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
మేస్త్రీ రాజు మరో మహిళతో చనువుగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయింది సులోచన. దీంతో ప్రతిరోజు గొడవ పడేది. అడ్డుగా ఉన్న సులోచనను చంపేయాలనుకున్నారు. ఈ నెల 9న సులోచనను మద్యం తాగుదామని మేస్త్రి రాజు, బూలీ పిలిచారు. ఏడుపాయల ఆలయ సమీపంలో మద్యం మత్తులో ఇద్దరు దాడి చేసి చంపేశారు (Murdered). సులోచన చనిపోయాక ఆమె ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలు తీసుకుని పరార్ అయ్యారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు.

