కలం, వెబ్డెస్క్: ఏపీలో కోవిడ్ కేసులు (AP COVID Cases) ఊహించని రీతిలో పెరిగిపోతున్నాయి. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా మరో పది కొత్త కేసులు నమోదవడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 49కి చేరువైంది. మరోవైపు ఇప్పటికే నలుగురు కోవిడ్ బాధితులు మృతి చెందారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో నమోదయ్యాయి. ఆ జిల్లాలో అత్యధికంగా 11 కేసులు నమోదయ్యాయి.
గుంటూరు జిల్లాలో ముగ్గురికి, ఎన్టీఆర్ జిల్లాలో ఇద్దరికి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, తిరుపతి, విశాఖ జిల్లాల్లో ఒక్కొకక్కరు చొప్పున కోవిడ్ బారిన పడ్డారు. ఇప్పటి వరకు కోవిడ్ నుంచి ఐదుగురు కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. 302 మందికి పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు.
కరోనా బాధితుల్లో ప్రస్తుతం 24 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 16 మంది ఇంటి వద్దే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొత్త కేసుల నమోదుతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అన్ని ఆస్పత్రుల్లో కోవిడ్ కేసుల కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. వైద్యారోగ్య శాఖ ఆదేశాల మేరకు కోవిడ్ పరీక్ష కిట్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు.

