కలం, నిజామాబాద్ బ్యూరో: కార్గిల్ విజయ్ దివస్ (Kargil Vijay Diwas) సందర్భంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal) అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్ట చౌరస్తాలో ఉన్న అమరవీరుల స్తూపం వద్ద పూలమాల వేసి వీర జవాన్ల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శించి శత్రువులను తరిమికొట్టి దేశ గౌరవాన్ని నిలబెట్టిందని అన్నారు. భారత త్రివర్ణ పతాకాన్ని విజయవంతంగా ఎగురవేసి ప్రపంచానికి దేశ సత్తాను చాటిందని పేర్కొన్నారు.
కార్గిల్ యుద్ధంలో సుమారు 500 మంది భారత సైనికులు దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించారని, వారి త్యాగాల ఫలితంగానే నేడు దేశ ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. అమరవీరుల కుటుంబాలకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ దేశ భద్రతతో పాటు సైనికుల సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతమైందని, దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తోందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, జిల్లా ప్రధాన కార్యదర్శి, 19వ డివిజన్ కార్పొరేటర్ నాగోళ్ల లక్ష్మీనారాయణ, మహిళా మోర్చా అధ్యక్షురాలు వనిత, యువ మోర్చా అధ్యక్షుడు వంశీ, కార్పొరేటర్లు బెల్లాల్ శశాంక్, మఠం పవన్, జ్యోతి మురళి, సుమిత్ర కిషోర్, ప్రసూన శ్రీనివాస్, మమత శివ, రాష్ట్ర కోశాధికారి విజయ్, సీనియర్ నాయకులు స్వామి యాదవ్ భూపతి తదితరులు పాల్గొన్నారు.

