కలం, వెబ్ డెస్క్: ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల నగదు డంప్ బయటపడింది. గరియాబంద్ (Gariaband) జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉన్న మావోయిస్ట్ల రహస్య స్థావరం వద్ద వీటిని శనివారం భద్రతా బలగాలు గుర్తించాయి. ఈ డంప్ నుంచి రూ.46లక్షలకు పైగా నగదు, ల్యాప్టాప్, ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. లొంగిపోయిన నక్సలైట్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ డంప్ను గుర్తించినట్లు తెలిపారు. మెయిన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడేగోబ్రా గ్రామ సమీపంలోని సంప్సతి అడవిలో డంప్ ఉన్నట్లు వాళ్లు చెప్పారని వెల్లడించారు. ఉద్యమంలోని ధంతేరి–గరియాబంద్–నౌపడ(డీజీఎన్) విభాగానికి చెందిన సీనియర్ నక్సలైట్ నాయకులు ఈ డంప్ను దాచినట్లు చెప్పారు.
కాగా, ఈ ఏడాది మార్చి 31లోగా దేశంలో నక్సలిజాన్ని రూపుమాపాలని కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రెండేళ్లుగా సాయుధ బలగాలు అడవులను చుట్టుముట్టాయి. మావోయిస్టుల కదలికలు ఉన్న ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో ఎన్కౌంటర్లు జరిగి అనేక మంది మావోయిస్టు అగ్రనేతలు చనిపోయారు. వందల సంఖ్యలో లొంగిపోయారు. మరోవైపు ప్రభుత్వ పునరావాస కార్యక్రమాలు సైతం చాలామందిని ఉద్యమం నుంచి బయటకు వచ్చేలా చేశాయి. అయితే, నక్సలిజం అంతమైనా.. వాళ్లు అడవుల్లో దాచిన పేలుడు పదార్థాలు, ఆయుధాల డంప్లు, మందుపాతరలు నష్టం కలిగించే ప్రమాదముంది. ఈ క్రమంలో ఈ డంప్ల కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. ఈ తరుణంలో ఆయుధాలతోపాటు భారీగా నగదు ఉన్న డంప్(Gariaband) ప్రస్తుతం బయటపడింది.

