కలం, వెబ్ డెస్క్: పారిశ్రామికీకరణలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉండాలని, అధికారులు ఆ దిశగా ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. శనివారం ప్రభుత్వ కార్యదర్శుల సమావేశంలో సీఎం రేవంత్ పాల్గొని మాట్లాడారు. మార్చి 4న జరిగే కలెక్టర్ల సమావేశంలో అందరి పని తీరుపైన మాట్లాడుతానని, ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యాచరణ ఉంటుందని సీఎం అన్నారు. కేంద్రం ఏర్పాటుచేసిన ఏఐ సమావేశం నిర్వహణపైన కొన్ని విమర్శలు వచ్చాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ అందరి దృష్టిని ఆకర్షించిందన్నారు. ప్రణాళికాబద్ధంగా జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించామని రేవంత్ అన్నారు.
కోర్ అర్బన్ రీజియన్లో చేపట్టాల్సిన కార్యాచరణపైన అధికారులు దృష్టి పెట్టాలని, ప్యూర్ అర్బన్ రీజియన్ 10 వేల చదరపు కిలో మీటర్ల పరిధిలో విస్తరించి ఉందని, ఇక్కడ మాన్యుఫాక్చరింగ్ రంగం విస్తరించాలని సీఎం వెల్లడించారు. సేవా రంగంలో వస్తున్న పెను మార్పులు గమనంలోకి తీసుకోవాలని, శాఖలపైన ప్రతి ఒక్కరికి సంపూర్ణ అవగాహన ఉండాలన్నారు. శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జాబితా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
ప్రభుత్వ కార్యాలయాలు (Government Departments) అద్దె భవనాల్లో ఉండడానికి వీలు లేదని, ప్రతి శాఖకు సొంత భవనం ఉండాలి.. బడ్జెట్ ప్రతిపాదనలో వీటిని చేర్చాలన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాల పైన ప్రతి శాఖ దృష్టి పెట్టాలని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సర్వీస్ సెక్టార్ ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని, ఆన్లైన్ విధానంలో అన్ని పనులు జరిగేలా చూడాలని రేవంత్ తెలిపారు. e ఫైల్ విధానం ఉండాలని చెబుతూ.. నిర్ణీత సమయంలో ఫైల్ క్లియర్ కావాల్సిందే ఆదేశాలు జారీ చేశారు. వివిధ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలు, పాతకాలం సర్వర్లను అప్డేట్ చేసుకోవాలని సూచించారు. సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలని, ఇందులో సాంకేతికతను వినియోగించుకోవాలి వెల్లడించారు.
అలాగే 30 వేల ఎకరాల్లో నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ పైన దృష్టి పెట్టాలని, ఫ్యూచర్ సిటీ దేశ ఆర్ధిక స్థితిని మార్చబోతోందన్నారు. మూసీ నది పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ఇక్కడ వచ్చే మార్పులను ప్రజలకు వివరించాలి సీఎం రేవంత్ (CM Revanth Reddy) అధికారులకు సూచనలు చేశారు. మార్చి 6 నుంచి 99 రోజుల ప్రణాళిక జూన్ 12 వరకు జరగబోతుందని, జూన్ 2 వరకు ప్రతి ఆఫీస్ పరిశుభ్రంగా కావాల్సిందేనని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. ప్రతి ఎన్నికలో ప్రజలు కావాల్సిన బలాన్ని ఇచ్చారని, ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు మంచి చేయాలని సూచించారు.

