కలం, వెబ్ డెస్క్: దేశంలో బ్రాహ్మణ వ్యవస్థపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Manda Krishna Madiga) సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో కుల వ్యవస్థకు కారణం బ్రాహ్మణులేనని అన్నారు. రాజులు, బ్రిటిషర్ల కాలం నుంచి బ్రాహ్మణులదే ఆధిపత్యం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే నాడు బ్రాహ్మణేతరులకు రిజర్వేషన్లు ఇచ్చారని అన్నారు. ఎస్సీ వర్గాలే కాదు.. మిగితా వర్ణాలవాళ్లూ బ్రహ్మణుల బాధితులేనని మండిపడ్డారు.
మందకృష్ణ మాట్లాడుతూ.. ‘ఈ దేశంలో కులవ్యవస్థను పెంచి పోషిస్తున్నది బ్రాహ్మణ వర్గమే. మెజారిటీ బ్రాహ్మణ సమాజం ఈ దేశంలో కుల వ్యవస్థకు ప్రధాన కారణం. కుల వ్యవస్థను ఈ దేశంలో రాముడు సృష్టించిండేమో, కృష్ణుడు సృష్టించిండేమో అనుకునేవాళ్లం. బహుశా ఈ కులవ్యవస్థకు రాముడో, కృష్ణుడో కారణం అని మేము అనుకోవడం లేదు. ఈ కుల వ్యవస్థకు, కుల అసమానతలకు, కుల వివక్షకు, అస్పృశ్యతకు కారణం బ్రాహ్మణ సమాజం. దీనిని పెంచింది.. పోషిస్తున్నది బ్రాహ్మణ వ్యవస్థ. భారతీయుల మధ్య అనైక్యత ఉండటానికి కుల వ్యవస్థే కారణం. దీనికి బ్రాహ్మణులే కారణం. ఈ దేశానికి ముస్లిం రాజులు వచ్చినా.. రాజుల పరిపాలనలో కేంద్ర బిందువుగా వారి కోసం అధికారం చెలాయించింది ఈ బ్రాహ్మణ వ్యవస్థ. ఈ దేశానికి క్రైస్తవమతం వచ్చినా బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలను ప్రభావితం చేసింది బ్రాహ్మణులే. హిందూ రాజులు పరిపాలించిన దేశంలో ఆ రాజుల దగ్గర ఎక్కువ లబ్ది పొందింది బ్రాహ్మణులే. కాబట్టే చివరి నిమిషంలో కొంతమంది రాజులు ఆలోచించారు, బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఆలోచించింది. కొల్హాపూర్ రాజు సాహు మహారాజ్ ఆలోచించాడు. ఈ వ్యవస్థలో మొత్తం అధికారులు అందరూ బ్రాహ్మణులే అయ్యారు. బ్రాహ్మణేతరులు అందరికి ఒక హక్కు కల్పించాలని రిజర్వేషన్లు ఇచ్చారు. దళితులకు కాదు మొత్తం బ్రాహ్మణేతరులకు రిజర్వేషన్లు ఇచ్చారు. మంత్రాలతో దేవుడినే శాసిస్తాం అనేంత అహంకారం బ్రాహ్మణులది. దేవుడినే శాసించే శక్తి తమకు ఉందని భావించే వారికి.. సామాన్య ఎస్సీలు లేదా ఇతర కులాల వారు అంటే లోకువగా ఉండటంలో ఆశ్చర్యం లేదు’ అని వ్యాఖ్యానించారు.

