కలం, వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పరిధిలోని నాదర్గుల్లో ఉన్న ‘మాతృదేవోభవ’(Matrudevobhava) అనాథ ఆశ్రమాన్ని నటుడు మంచు మనోజ్ (Manchu Manoj) సందర్శించారు. ఆశ్రమ నిర్వాహకుడు గిరి సోషల్ మీడియా ద్వారా చేసిన అభ్యర్థనకు స్పందించిన మనోజ్ ఈ సందర్శన చేశారు. ఆశ్రమంలోని అనాథలు, మానసికంగా బాధపడుతున్న వ్యక్తుల కోసం మంచు మనోజ్ టేబుల్స్, కుర్చీలు అందజేశారు. సమాజం పట్టించుకోని మతిస్థిమితం లేని వ్యక్తులను చేరదీసి గిరి చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆయన అభినందించారు. “మాతృదేవోభవ” ఆశ్రమానికి ఎల్లవేళలా అండగా ఉంటానని నిర్వాహకుడికి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ‘సెలబ్రిటీతో పునర్జన్మ చాలెంజ్’లో మలక్పేట్ రోడ్డుపై మతిస్థిమితం లేని ఒక వ్యక్తిని ఆశ్రమానికి తీసుకువచ్చారు. మంచు మనోజ్ స్వయంగా అతనికి జుట్టు, గడ్డం కత్తిరింపజేసి, నూతన వస్త్రాలు, భోజనం అందించి సాధారణ జీవితంలోకి తిరిగి తీసుకొచ్చారు.. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, మంచు మనోజ్ సేవా కార్యక్రమంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

