కలం, వెబ్ డెస్క్: సినీ నటుడు మంచు మనోజ్ (Manchu Manoj) తన పుట్టిన రోజు వేడుకలకు ముందు తన భార్య భూమా మౌనికతో కలిసి ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న తర్వాత అన్నింటికంటే మానవత్వం, మనకు తోడుగా నిలిచే మనుషులే ముఖ్యమని గ్రహించామని ఆయన పేర్కొన్నారు. తమలో ఉన్న ఈ సేవా భావం ఈనాటిది కాదని, తమ తల్లిదండ్రుల నుంచే అలవర్చుకున్నామని చెప్పారు. కష్టాల్లో ఉన్న వారికి తమ ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని తెలిపారు. ఈ నేపథ్యంలో తన భార్య మౌనిక ఆలోచనతో పుట్టిన, తమ హృదయానికి ఎంతో దగ్గరైన ఒక సేవా సంస్థను ప్రారంభిస్తున్నట్లు మనోజ్ ప్రకటించారు. ఆ సంస్థకు ఐక్య ధైర్య సేన సమితి (AIKYA Dhairya Sena Samithi) అని పేరు పెట్టినట్లు వెల్లడించారు.
ఐక్య అంటే ఐకమత్యమని, మానవత్వం కోసం అందరం కలిసికట్టుగా ముందుకు రావడమే దీని ముఖ్య ఉద్దేశమని మనోజ్ వివరించారు. దేవుడు తమకు ప్రసాదించిన దాంట్లో కొంత భాగాన్ని సమాజ సేవకు, విలువైన ఆశయాల కోసం పంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ సంస్థ ద్వారా రక్తదాన శిబిరాలు, అత్యవసర వైద్య సహాయం, అలాగే ఆపదలో ఉండి సహాయం కోరే ప్రతి ఒక్కరికీ ఐక్య అండగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి ఎటువంటి రాజకీయ రంగు లేదని, ఇది కేవలం తమది మాత్రమే కాదని, మానవత్వాన్ని నమ్మే ప్రతి ఒక్కరిదని స్పష్టం చేశారు. అలాగే ఈ ట్రస్ట్ ద్వారా మొదటగా ఐదుగురు పిల్లలను దత్తత తీసుకుని, వారి చదువు బాధ్యతలను ఈరోజు నుంచే పూర్తిగా తీసుకుంటామని మనోజ్ (Manchu Manoj) ప్రకటించారు.
Read Also: జియో వరల్డ్ డ్రైవ్లో ‘పెద్ది’ గ్రాండ్ ఈవెంట్
Follow Us On: Sharechat

