కలం, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ భార్యభర్తల మధ్య ఫోన్ పాస్వర్డ్ విషయంలో తలెత్తిన వివాదం చివరకు భార్య హత్యకు దారితీసింది. రేవా జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. లౌవా గ్రామానికి చెందిన దీపక్ మిశ్రాను తన భార్య శిఖా మిశ్రా ఫోన్ పాస్వర్డ్ అడిగింది. దీంతో ఆగ్రహానికి గురైన దీపక్ “నీ ఫోన్ పాస్ వర్డ్ ఇవ్వవు కానీ.. నా ఫోన్ పాస్ వర్డ్ కావాలా” అంటూ పిల్లల ముందే భార్యపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్ర గాయాలపాలైన శిఖ స్థానిక సంజయ్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
పెళ్లి అయ్యాక గత పదేళ్లుగా ఈ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారని, ఘటన జరిగిన సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడని, పిల్లల ముందే ఈ దారుణానికి ఒడిగట్టాడని బాధితురాలి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మృతురాలి ముఖం, మెడ, కడుపుపై నిందితుడు కత్తితో తీవ్ర గాయాలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఫోన్ పాస్వర్డ్ విషయమే కాకుండా, మగ సంతానం లేదనే కారణంతో కూడా నిందితుడు తరచూ గొడవపడేవాడని విచారణలో తేలిందన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

