కలం, వెబ్ డెస్క్: తెలంగాణ (Telangana)లో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు తీవ్రమవుతున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు (Temperatures) భారీగా పెరగడంతో పాటు వడగాలులు (Heatwave) వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడంతో పాటు ఏప్రిల్ 12వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ఏప్రిల్ 12వ తేదీ నుంచి 22 వరకు తీవ్రమైన వడగాలులు వీస్తాయని, ఉష్ణోగ్రత 40 డిగ్రీల వరకు ఉంటుందని హెచ్చరించారు. తూర్పు, ఉత్తర తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు కూడా దాటే అవకాశం ఉందంటున్నారు. హైదరాబాద్లో 10 రోజుల వరకు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల నుంచి 41 డిగ్రీల వరకు వరకు నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఎండ సమయంలో ప్రయాణాలు మానుకోవాలని, తరచూ తగినంత నీళ్లు తాగి హైడ్రేటెడ్గా ఉండాలని, బయటకు వెళ్లినప్పుడు ఎండ నుంచి సంరక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది.

