కలం, వరంగల్ బ్యూరో : జయశంకర్ భూపాలపల్లి (Bhupalpally) జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. జవహర్ నగర్ కాలనీలో నివసించే హరికృష్ణ అనే వ్యక్తిపై కోతుల గుంపు ఒక్కసారిగా విరుచుకుపడింది. గుంపుగా వచ్చిన కోతుల నుంచి తనను తాను రక్షించుకోవాలని ఆయన చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ పెనుగులాటలో హరికృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే హరికృష్ణ మరణించినట్లు ధృవీకరించారు. నివాస ప్రాంతాల్లో కోతుల సంచారం పెరగడం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది.

