కలం, వెబ్ డెస్క్: శ్రీనగర్-జమ్మూ వందే భారత్ (Vande Bharat) ఎక్స్ప్రెస్ రైలుకు అత్యున్నత స్థాయి భద్రతను కల్పించేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. భద్రతా పరిస్థితుల దృష్ట్యా, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కి చెందిన ఎలైట్ కమెండో యూనిట్ ‘కోరాస్’ (CORAS) రంగంలోకి దిగింది. ఈ ప్రత్యేక దళం రైలు మార్గాల్లోని సున్నితమైన ప్రాంతాలు, టన్నెళ్లు, వంతెనల వద్ద నిరంతరం నిఘా ఉంచుతుంది. అత్యాధునిక ఆయుధాలు, నిఘా పరికరాలతో సన్నద్ధమైన ఈ కమెండోలు, ప్రయాణికుల రక్షణే ధ్యేయంగా రైలు లోపల, వెలుపల పటిష్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయనున్నారు.
ఈ ప్రతిష్టాత్మక రైలు ప్రాజెక్టు కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా, కాశ్మీర్ లోయను దేశంలోని ఇతర ప్రాంతాలతో మరింత పటిష్టంగా అనుసంధానిస్తుంది. ఉగ్రవాద ముప్పు, ఇతర భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి కోరాస్ బృందాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ముఖ్యంగా ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ వెంట ఉన్న క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులున్నాయి. వీటిని దృష్టిలోని ఉంచుకుని, రైల్వే ఆస్తులకు, ప్రయాణికులకు ఎలాంటి హాని కలగకుండా ఈ కమెండోలు 24 గంటలపాటు పహారా కాయనున్నారు. దీనివల్ల స్థానిక పర్యాటకం మెరుగుపడటంతో పాటు ప్రయాణికుల్లో భద్రతా భావం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

