కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ (Hyderabad) నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన యువతిని వివాహం చేసుకోవాల్సిన యువకుడు, పెళ్లికి కొన్ని గంటల ముందే బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా పొట్లూరు మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన లోకేష్ (29), గండిమైసమ్మ ప్రాంతంలోని ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో పనిచేస్తున్న ఒక యువతితో అతను ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ ఆర్యసమాజ్ లో శనివారం వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు.
పెళ్లి పనుల నిమిత్తం వారు శుక్రవారం కేపీహెచ్బీ (KPHB) పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఓయో రూమ్ తీసుకున్నారు. తాను పెళ్లి బట్టలు వేసుకుని ఉన్నానని, భోజనం తీసుకురావాలని లోకేష్ తన ప్రియురాలికి చెప్పాడు. ఆమె భోజనం తీసుకుని వచ్చిన తర్వాత లోపలి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆమె ఎంత పిలిచినా తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన యువతి, ఓయో సిబ్బందికి సమాచారం అందించింది.
సిబ్బంది సహాయంతో తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూడగా, లోకేష్ ఫ్యాన్కు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు. పెళ్లి దుస్తుల్లోనే అతను ఈ అఘాయిత్యానికి పాల్పడటం అక్కడి వారిని కలచివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.

