కలం, వెబ్ డెస్క్ : నెల్లూరు (Nellore) జిల్లా కోవూరులో ఒక వింత సంఘటన చోటుచేసుకుంది. భగత్ సింగ్ కాలనీకి చెందిన వలీ అనే వ్యక్తి స్థానిక హోటల్లో భోజనం చేస్తుండగా, ఒక రక్తపింజరి పాము అతనిని కాటు వేసింది. దీంతో అతడు ఆ పామును అక్కడే చంపేశాడు.
పాము కాటు వేయడంతో తనకు ప్రాణాపాయం కలగవచ్చనే ఆందోళనతో నేరుగా ఆసుపత్రికి బయలుదేరాడు. అయితే తనను కాటేసిన పాము ఏ రకానికి చెందినదో వైద్యులకు చూపించాలనే ఉద్దేశంతో చనిపోయిన ఆ పామును కూడా వెంటబెట్టుకుని వచ్చాడు.
చేతిలో పామును పట్టుకుని అతను ఆసుపత్రిలోకి ప్రవేశించడంతో అక్కడున్న రోగులు, వైద్య సిబ్బంది షాక్కు గురయ్యారు. వైద్యులు బాధితుడికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్య కోసం అతడిని నెల్లూరులోని ప్రధాన ఆసుపత్రికి తరలించారు.

