కలం, మెదక్ బ్యూరో : చంద్రగ్రహణం(Lunar Eclipse) సందర్భంగా ఉమ్మడి మెదక్ (Medak) జిల్లాలోని పలు ప్రముఖ ఆలయాలను(Temples) తాత్కాలికంగా మూసివేశారు. గ్రహణ సమయంలో శాస్త్రోక్త ఆచారాలను పాటిస్తూ ఆలయ ద్వారాలను మూసివేయడం సంప్రదాయంగా కొనసాగుతున్నట్లు అర్చకులు తెలిపారు. సిద్దిపేట (Siddipet) జిల్లా కొమురవెళ్లి మల్లికార్జున స్వామి ఆలయంలో చంద్రగ్రహణం ప్రారంభానికి ముందు నుంచే దర్శనాలను నిలిపివేసి ఆలయాన్ని మూసివేశారు.
గ్రహణం ముగిసిన అనంతరం ఆలయాన్ని శుద్ధి చేసి, సంప్రోక్షణ, పుణ్యాహవాచనం వంటి కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తామని అర్చకులు వెల్లడించారు. అలాగే మెదక్ (Medak) జిల్లాలోని ఏడుపాయల వనదుర్గ అమ్మవారి ఆలయాన్ని గ్రహణం సందర్భంగా మూసివేశారు. గ్రహణం ముగిసిన తర్వాత శుద్ధి కార్యక్రమాలు పూర్తి చేసిన తరువాతే ఆలయాన్ని తిరిగి భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

